ఏపీ అభివృద్ధికి ఉచిత ఇసుక విధానం తొలిమెట్టు – టీడీపీ
గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ స్వలాభం కోసం సిమెంటు, ఇసుక ధరలు విపరీతంగా పెంచడం వల్ల నిర్మాణరంగం కుదేలైందని టీడీపీ స్పష్టం చేసింది. గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటుందని ట్వీట్ చేసింది. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి తొలి మెట్టు ఉచిత ఇసుక విధానం అని తెలిపింది. పేద బడుగు బలహీన వర్గాలు దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వారి సొంత ఇంటి కల నెరవేరటానికి అతి ముఖ్యమైన ఇసుక ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. దీంతో భవన నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. పేద, మధ్యతరగతి వారి సొంత ఇంటి కల నెరవేరుతుందని టీడీపీ స్పష్టం చేసింది. అయితే భవన నిర్మాణ రంగానికి సంబంధించి అనుయాయ రంగాలు కూడా ఆర్థికంగా పుంజుకుంటాయని పేర్కొంది. భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ సామాగ్రి రవాణా కార్మికులు , సిమెంటు, స్టీలు వ్యాపారస్తులు, కలప వ్యాపారస్తులు, వడ్రంగి కార్మికులు, ఎలక్ట్రికల్ సామాగ్రి వ్యాపారస్తులు, ఎలక్ట్రీషియన్స్, పెయింట్స్ వ్యాపారస్తులు, పెయింటర్స్, టైల్స్ వ్యాపారస్తులు, టైల్స్, లేయింగ్ కార్మికులు, ప్లంబింగ్ కార్మికులు ఇకపై ఆర్థికంగా పుంజుకుంటారని టీడీపీ అభిప్రాయపడింది. గత ఐదు సంవత్సరాలుగా ఆర్థికంగా స్తంభించిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు తొలిమెట్టు ఉచిత ఇసుక అని ప్రకటించింది.