మే 19న బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ ఎంతటి కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ పార్టీలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది యూత్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్‌ సరఫరా జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు జిఆర్‌ ఫామ్‌హౌస్‌పై దాడి చేసి 103 మంది అరెస్ట్‌ చేశారు. వారిలో టాలీవుడ్‌ నటి హేమ కూడా ఉండడంతో ఈ వార్త క్షణాల్లో వైరల్‌ అయిపోయింది. హేమ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిందన్న వార్తపై ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత హేమ అరెస్ట్‌ కావడం, బెయిల్‌పై విడుదల కావడం జరిగింది. ఈలోగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఈ విషయంపై స్పందిస్తూ హేమ సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేసింది. పోలీసులు అరెస్ట్‌ చేసిన రోజు నుంచీ తాను నిర్దోషినని చెబుతూ వచ్చిన హేమ తాజాగా ‘మా’కు ఒక లెటర్‌ సమర్పించింది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకి ఆ లెటర్‌ను అందించింది. 

తాను ఆ కేసులో నిందితురాల్ని మాత్రమేనని, దోషి అని నిర్ధారించే ఎలాంటి ఆధారాలు పోలీసుల దగ్గర లేవని ఆ లెటర్‌లో పేర్కొన్నారు హేమ. దేశంలోనే అత్యుత్తమ లేబొరేటరీలో రక్త పరీక్షలు చేయించుకున్నానని, డ్రగ్స్‌ వాడకానికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్ళు లేవని రిపోర్ట్‌ వచ్చిందని ఆమె తెలిపింది. పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన టెస్టుల్లో కూడా ఇదే రిజల్ట్‌ వస్తుందన్న నమ్మకం తనకు ఉంది అంటోంది. మీడియాలో తనపై వచ్చిన కథనాల వల్ల ఒత్తిడికి లోనై ‘మా’ నన్ను సప్పెండ్‌ చేసిందని, విచారణలో దోషి అని తేలేవరకు అందరూ నిర్దోషులేనని ఆ లెటర్‌లో వివరించారు హేమ. నిబంధనలకు వ్యతిరేకంగా తనను సస్పెండ్‌ చేశారని, కాబట్టి ఆ సస్పెన్షన్‌ని వెంటనే రద్దు చేయాలని ఆమె కోరారు. ఆ లెటర్‌ కాపీని ‘మా’ వ్యవస్థాపకుడు మెగాస్టార్‌ చిరంజీవికి కూడా పంపారు హేమ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here