సలార్, కల్కి వంటి భారీ హిట్స్ తర్వాత పాన్ ఇండియా స్టార్ చేస్తున్న సినిమా ‘ది రాజా సాబ్’. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించనుంది. త్వరలోనే సెట్స్పైకి వెళ్ళే ఈ సినిమా 1940 ప్రాంతంలో స్వాతంత్య్ర సమరం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ కథను తన మాతృభూమి ప్రజలకు న్యాయం చేయడానికి ఒక యోధుడు రాసుకున్న కథగా తెరకెక్కించనున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసే ఒక ఫౌజీ(సైనికుడు)గా ప్రభాస్ ఈ సినిమాలో కనిపిస్తారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటించనుంది. బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తారు. అత్యంత భారీ బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో ఈ మూవీ తెరకెక్కనుంది. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుదీప్ ఛటర్జీ, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైన్ : రామకృష్ణ, మోనికా, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు తదితర సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.