ప్రస్తుత జనరేషన్లో ఒక సినిమా తీసి ప్రేక్షకుల్ని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. 24 క్రాఫ్ట్స్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఇంతకుముందు సూపర్హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లు సైతం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచెయ్యాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే డైరెక్టర్ హరీష్ శంకర్కి వచ్చింది. రవితేజ కాంబినేషన్లో ఇంతకుముందు షాక్, మిరపకాయ్ వంటి సినిమాలు చేశారు హరీష్. షాక్.. సినిమా పరంగా బాగానే ఉన్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. మిరపకాయ్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తాజా సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా విడుదలైన రోజు నుంచీ విమర్శలు ఎదుర్కొంటోంది.
సినిమాలో కొన్ని క్యారెక్టర్లు, హీరోహీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, కొంత పిచ్చి కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్.. ఇలా ఒకటేమిటి సినిమాలోని చాలా పాయింట్స్పై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఈ విషయంలో హరీష్ శంకర్ని ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టారు. విషయాన్ని గ్రహించిన హరీష్, రవితేజ తమ సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రేక్షకుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న కొన్ని సీన్స్ను తొలగిస్తే బాగుంటుందని వారు భావిస్తున్నారు. దాదాపు 15 నిమిషాల లెంగ్త్ని తగ్గించబోతున్నారు. అయితే సినిమాలోని ఏయే సీన్స్ కట్ చేస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కొత్త వెర్షన్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందనేది కూడా అఫీషియల్గా ఎనౌన్స్ చెయ్యలేదు.
నెటిజన్లు ముఖ్యంగా హరీష్ శంకర్నే టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాపై రకరకాల కామెంట్స్ పెడుతూ డైరెక్టర్తో ఆడుకుంటున్నారు. సినిమా గురించి పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నవారికి మాత్రమే సమాధానమిస్తున్నాడు. నెగెటివ్గా కామెంట్ చేసిన వారిని పట్టించుకోవడం మానేశాడు. దానికి కూడా వాళ్ళు స్పందిస్తూ సినిమా బాగుందని చెబితేనే రిప్లై ఇస్తావా? బాగా లేదంటే రెస్పాండ్ అవ్వవా? అంటూ అతని వెంటపడుతున్నారు. హరీష్ శంకర్ ఇప్పటివరకు చేసిన ఏ సినిమాకీ ఈ తరహాలో ట్రోల్ జరగలేదు. ‘మిస్టర్ బచ్చన్’ను ట్రిమ్ చెయ్యాలని హరీష్ శంకర్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి మరి.