రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.లక్ష, రూ.లక్షన్నర, రూ. రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. అయితే, ఈ మూడు విడతల్లోనూ చాలా మంది రైతులు వివిధ సాంకేతిక కారణాలతో రుణమాఫీకి అనర్హులు అయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరో వైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రుణ మాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాటతప్పిందని ఎదురుదాడికి దిగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కన్నా ఈసారి రుణమాఫీలో లబ్ధిపొందిన రైతులు, ప్రభుత్వం చెల్లించిన మొత్తంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ గణాంకాలను ముందు పెట్టుకుని బీఆర్ఎస్ విమర్శలకు దిగడం, కాంగ్రెస్ నాయకత్వం ప్రతివిమర్శలు చేయడంతో రుణమాఫీ వ్యవహారం రాజకీయ టర్న్ తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.