ఇప్పటి వరకు రూ.2 లక్షల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని వ్యవసాయ శాఖ పేర్కొంది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పాసు బుక్ సరిగా, స్పష్టంగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఈ రుణమాఫీ జరిగిందని, ఇందులో ఏ సందేహం లేదని తెలిపింది. బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్ నెంబర్లలో తప్పులున్నవి, పాస్ బుక్ నెంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న పేర్లతో ఆధార్ లో ఉన్న పేర్లతో సరిపోని ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. వీటన్నింటినీ సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి, వీటిని సరి చేసుకుంటే వీరి ఖాతాల్లో రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేస్తుందని వ్యవసాయ శాఖ ప్రకటించింది.