చియాన్‌ విక్రమ్‌ అంటే విలక్షణమైన, విభిన్నమైన క్యారెక్టర్లకు మారుపేరు. తను చేసే ప్రతి సినిమాలోనూ కొత్తదనాన్ని కోరుకునే విక్రమ్‌ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. తన క్యారెక్టర్‌ ఎలివేట్‌ అయ్యేందుకు ఎంత కష్టపడేందుకైనా సిద్ధపడే విక్రమ్‌ తాజాగా ‘తంగలాన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే ఈ చిత్ర దర్శకుడు పా.రంజిత్‌ కూడా దర్శకుడుగా, నిర్మాతగా చేసిన సినిమాలన్నీ విభిన్నమైనవే. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘తంగలాన్‌’ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తోందని తెలుస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు రూ.30 కోట్లు కలెక్ట్‌ చేసినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. విక్రమ్‌ సినిమాలను మొదటి నుంచీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఆ విధంగా టాలీవుడ్‌ అంటే విక్రమ్‌కి ఎంతో ఇష్టం. ‘తంగలాన్‌’ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌ చెప్పేందుకు సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. 

తెలుగులో ఈ సినిమాకి లభిస్తున్న ఆదరణకు కృతజ్ఞత తెలియజేస్తూ.. తన  అభిమానులకు ఓ శుభవార్తను కూడా చెప్పారు విక్రమ్‌. తంగలాన్‌ చిత్రానికి సీక్వెల్‌ను కూడా తెరకెక్కించబోతున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి దర్శకుడు రంజిత్‌, నిర్మాత జ్ఞానవేల్‌రాజాలతో డిస్కషన్‌ జరిగిందని చెప్పాడు విక్రమ్‌. రంజిత్‌ కొంత టైమ్‌ తీసుకున్న తర్వాత ‘తంగలాన్‌2’ని ప్రారంభిస్తామని ఎనౌన్స్‌ చేశాడు విక్రమ్‌. ఈమధ్యకాలంలో పెద్ద సినిమాలన్నీ రెండు భాగాలుగా రూపొందుతున్న నేపథ్యంలో తంగలాన్‌ చిత్రాన్ని కూడా సీక్వెల్‌గా చేయబోతున్నామని ప్రకటించడంతో మొదటి భాగాన్ని మించిన స్థాయిలో రెండో భాగం ఉంటుందనే అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here