ధీమాలో రాజేందర్ రావు
డీసీసీ పగ్గాలు తనకు దక్కడం ఖాయమని వెలిచాల రాజేందర్ రావు గట్టి ధీమాతో ఉన్నారని తెలుస్తోంది. కరీంనగర్ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి సంబంధాలు కలిగి ఉన్న రాజేందర్ రావు తనకు డీసీసీ బాధ్యతలు అప్పగిస్తే ప్రణాళికబద్ధంగా స్థానిక సంస్థల, మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సన్నద్ధం చేసే బాధ్యత తీసుకోగలుగుతానని ఇప్పటికే ముఖ్య నేతల వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నందున ప్రతీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవల్సిన అవసరం ఉందని.. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సీఎం సన్నిహితుల వద్ద కూడా వెలిచాల రాజేందర్ రావు తనవంతు ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా గతంలో పని చేసిన రాజేందర్ రావు చొప్పదండి అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి.. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి ఒకసారి ప్రజారాజ్యం పార్టీ పక్షాన, ఇటీవల కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేశారు. అంగబలం, అర్థబలం పుష్కలంగా ఉన్న రాజేందర్ రావు తనకు డీసీసీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీని బలోపేతం చేసేందు కు తనవంతు కృషి చేస్తానని చెబుతుండగా… పలువురు ముఖ్య నేతలు కూడా ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.