తన మ్యూజిక్‌తో అందర్నీ మెస్మరైజ్‌ చేసిన ఇళయరాజా.. కొన్ని సార్లు కొన్ని రకాల వివాదాలతో వార్తల్లోకి వచ్చారు. గానగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంతో ఒకసారి, ఇటీవల మంజుమల్‌ బాయ్స్‌ నిర్మాతలతో  ఏర్పడిన వివాదాల వల్ల కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన కుమారుడు, ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజా కూడా అదే బాటలో వెళ్తున్నాడు. తాజాగా ఓ వివాదంలో చిక్కుకొని కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. 

విషయం ఏమిటంటే.. చెన్నయ్‌లోని నుంగంబాక్కంలో జమీలా అనే మహిళ యువన్‌ శంకర్‌రాజాగా ఇల్లు అద్దెకు ఇచ్చింది. ఇప్పుడామె యువన్‌ తనకు అద్దె బకాయి పడ్డాడని ఆరోపిస్తోంది. దాదాపు రూ.20 లక్షలు అద్దె రూపంలో చెల్లించాల్సి ఉండగా ఇంటి యజమానికి చెప్పకుండా ఇంటిని ఖాళీ చేయడమే కాకుండా ఇంటికి నష్టం కలిగించాడంటూ జమీలా సోదరుడు మహ్మద్‌ జావిద్‌ ఫిర్యాదు చేశాడు. అద్దె చెల్లించకపోవడమే కాకుండా అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేసినందున యువన్‌ శంకర్‌రాజాపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడ్డాడు జావిద్‌. 

దీనిపై స్పందించిన యువన్‌ ప్రతి కౌంటర్‌ దాఖలు చేశారు. ఇంటి యజమాని ఆరోపణల్లో నిజం లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకే జావిద్‌ ఈ ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జావిద్‌పై పరువు నష్టం దావా వేశారు యువన్‌. ఇప్పుడీ కేసు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ కేసులో న్యాయం ఎవరి వైపు ఉంది అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. మరి కోర్టులో వాదోపవాదాలు ఎలా జరుగుతాయో తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here