రూ. 300కే…
టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీని కల్పించడం తమ ఉద్దేశమని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. 65,500 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ (గవర్నమెంట్ టూ గవర్నమెంట్), జీ2సీ (గవర్నమెంట్ టూ సిటీజన్) కనెక్టివిటీ కల్పించడంతో పాటు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.