అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేసిన క్రమంలోనే అక్కినేని నాగార్జున ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన కోర్టు ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతకు స్టే మంజూరు చేసింది. ఈరోజు ఉదయం ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేతకు సంబంధించి అక్కినేని నాగార్జున ఒక ప్రకటన చేశారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించారు. నాగార్జున విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా స్పందించారు. 

‘స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు వ్యతిరేకంగా ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చి వేయడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు మేము చట్టాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలియజేయడం కోసం ఈ ప్రకటన జారీ చేయడం సరైందని నేను భావించాను. ఇది పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్‌ ప్లాన్‌ కూడా ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేట్‌ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేశారు. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది. ఈరోజు కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చెయ్యలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. 

చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించేవాడిని. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను’ అని అక్కినేని నాగార్జున ఆ ప్రకటనలో తెలిపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here