సోషల్ మీడియా బాగా విస్తరించిన ప్రస్తుత సమయంలో ఏ చిన్న విషయం జరిగినా దాన్ని తెరపైకి తెచ్చి నలుగురికీ షేర్ చేస్తున్నారు. తద్వారా తాము పెట్టిన కంటెంట్కి వ్యూస్గానీ, కామెంట్స్గానీ బాగా వస్తాయన్న ఉద్దేశం కావచ్చు, ఫాలోవర్స్ని పెంచుకునే ఆలోచన కావచ్చు. సెలబ్రిటీల్లో ఈ పోకడ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫేడ్ ఔట్ అయిపోయిన నటీనటులు లేదా చిన్న స్థాయి ఆర్టిస్టులు ఇలాంటి జిమ్మిక్స్ చేస్తుంటారు. అయితే జరిగింది వాస్తవమే అయినా దాన్ని భూతద్దంలో చూపించి మరీ మనల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఓ ఘటన గురించి నటి నమిత సోషల్ మీడియాలో అందరితో షేర్ చేసుకుంది.
2002లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘సొంతం’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన నమిత ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా నటిగా అంతగా గుర్తింపు రాలేదు. దీంతో తన రూటు మార్చుకొని కుర్రకారుని రెచ్చగొట్టే వ్యాంప్ తరహా పాత్రల్లో నటించింది. ఆ క్యారెక్టర్స్ ఆమెకు మంచి ఫాలోయింగ్ని తెచ్చిపెట్టాయి. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సింహా’లోని క్యారెక్టర్ ఆమెకు మంచి పేరు తెచ్చింది. తెలుగులోనే కాదు, తమిళ్తోపాటు ఇతర భాషా చిత్రాల్లోనూ నటించిన నమిత 2017లో పెళ్ళి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది.
సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా ఫ్యామిలీతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లింది నమిత. అయితే అక్కడ ఆమెకు ఓ ఊహించని ఘటన జరిగింది. నమితను అక్కడి అధికారులు ఆలయంలోకి అనుమతించలేదు. అంతేకాదు, తన సర్టిఫికెట్స్ చూపించాల్సిందిగా కోరారు. దీనికి షాక్ అయిన నమిత వెంటనే సోషల్ మీడియాను ఆశ్రయించి తనకు జరిగిన అవమానాన్ని అందరితోనూ పంచుకుంది. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేవాలయాలకు తాను వెళ్లానని, ఎక్కడా ఇలా జరగలేదని వాపోయింది. అంతేకాదు, ఆలయ అధికారులు కూడా తనపట్ల అమర్యాదగా మాట్లాడారంటూ ఓ పోస్ట్ పెట్టింది.
నమిత పోస్ట్ పెట్టింది కాబట్టి నిమిషాల్లో అది వైరల్గా మారిపోయింది. ఇది ఆలయ సిబ్బంది దృష్టికి కూడా వెళ్లింది. సోషల్ మీడియాలో నమిత చేసిన కామెంట్స్పై ఆలయ అధికారులు స్పందిస్తూ.. ఆమెతో అధికారులెవ్వరూ అమర్యాదగా మాట్లాడలేదని, ఆలయ నిబంధనల ప్రకారమే మాట్లాడామని చెప్పారు. పై అధికారులు చెప్పడం వల్లే ఆమెను కొంతసేపు ఆపి, ఆ తర్వాత ఆలయంలోకి అనుమతించామని తెలిపారు. వాస్తవానికి ఇది సోషల్ మీడియాలో రచ్చ చేసేంత విషయం కాదు అనేది అర్థమవుతూనే ఉంది. ఆలయ అధికారులు రెగ్యులర్గా చేసే చెకప్స్లో భాగంగానే ఇది జరిగి ఉంటుంది. కాకపోతే నమిత అత్యుత్సాహంతో పెట్టిన పోస్ట్ నెటిజన్లకు పని కల్పించింది.