AP TG Floods : తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. చాలా ప్రాంతాలు వరద నీటి మునిగిపోయాయి. ప్రజలు ఇళ్ల పైకెక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాగులు దాటుతూ కొందరు, గొర్రెల కాపరులు, కాలనీల్లో చిక్కుకున్న వారు… సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తెలంగాణలో 16 మంది, ఏపీలో 15 మంది జలప్రళయానికి బలైపోయారు. ఇళ్లు నీట మునిగి సర్వస్వం కోల్పోయి లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తక్షణమే స్పందించినా… ప్రకృతి విలయతాండవం ముందు నిలువలేకపోతున్నాయి. ఈ విపత్కర సమయంలో సాటి మనిషికి సాయం చేసేందుకు జనం కదిలారు. వరద బధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. వరదబాధితులను కాపాడేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, వాలంటీర్లు రాత్రింబవళ్లు ప్రాణాలు లెక్కచేయకుండా సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇక స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలు, పలు సంస్థలు, నేతలు… బాధితులకు ఆహార పదార్థాలు, మంచినీరు అందిస్తున్నారు.