ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… వరద ప్రజల బతుకుల్లో విషాదాన్ని నింపాయన్నారు. బాధితులను ఆదుకునేందుకు మంత్రులు, అధికారులు నిరంతరం కష్టపడుతున్నారన్నారు. గత 60, 70 ఏళ్లలో ఇంత భారీ వర్షం చూడలేదని చెబుతున్నారు. వరదలో రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న వందల కుటుంబాలు నష్టపోయాయని ఆవేదన చెందారు. కష్టపడి సంపాదించుకున్నవన్నీ వరద నీటిలో మునగడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. తమ పిల్లల సర్టిఫికెట్లు వరద నీటిలో నానిపోయాయని ప్రజలు వాపోతున్నారన్నారు. బాధితులకు తక్షణమే నిత్యవసరాలు అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు.