Garikapadu NH Road : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రహదారుల పై నుంచి వరద ప్రవహిస్తుంది. దీంతో వాహన రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఏపీ, తెలంగాణ సరిహద్దులో గరికపాడు వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద సరకు లారీలను నిలిపివేశారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో మరో మార్గం లేక లారీలు, కార్లు, ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాహనదారులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. రాత్రి నుంచి రోడ్లపైనే ఉంటూ, అక్కడే భోజనాలు చేస్తున్నారు. కోదాడ వరకు వస్తున్న వాహనాలను పోలీసులు మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. వాహనదారులు కోదాడ వైపు రావద్దని డీఎస్పీ శ్రీధర్రెడ్డి కోరుతున్నారు.