తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఎందరో నిరాశ్రయులు అయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కష్ట సమయంలో తెలుగు ప్రజలకు అండగా ఉండటానికి ఎప్పటిలాగే తెలుగు సినీ పరిశ్రమ కదిలి వస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, త్రివిక్రమ్, వైజయంతి మూవీస్, హారిక & హాసిని క్రియేషన్స్ తమ వంతుగా వరద బాధితులను ఆదుకోవడానికి విరాళాలను ప్రకటించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించారు.

“50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది, వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను.రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అని బాలకృష్ణ ప్రకటనలో తెలిపారు.

కాగా, అబ్బాయి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ కి రూ.50 లక్షలు, తెలంగాణకి రూ.50 లక్షలు చొప్పున కోటి ప్రకటించగా.. బాబాయ్ బాలకృష్ణ కూడా అదే బాటలో పయనిస్తూ కోటి రూపాయలు ప్రకటించడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here