కొన్నిరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎంతగానో విలవిలలాడుతున్నాయి.అసలు వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో కూడా తెలియని పరిస్థితి.ఎంతో మంది తింటానికి తిండి లేక, ఉన్న ఇల్లు కూడా కోల్పోయి నిరాశ్రయులవుతున్నారు. దీంతో తెలుగు వారిని ఆదుకోవడానికి పలువురు హీరోలతో పాటు ఇతర సినీ ప్రముఖులు ముందుకు వచ్చి తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కూడా తన వంతు సాయాన్ని ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వానికి యాభై లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి యాభై లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలని ప్రకటించాడు. ఆ మొత్తాన్ని సిఎం సహాయనిధికి అందిస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలియ చేసిన చిరు తెలుగు వాళ్లంటే తనకి ఎంత అభిమానమో మరోసారి తన మాటల ద్వారా చెప్పుకొచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకి కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచి వేస్తున్నాయి, పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం కూడా ఎంతో విషాదకరం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి.
అదే విధంగా మనమందరం ఏదో ఒక విధంగా సహాయ చర్యల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలిగిపోయి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు.రీసెంట్ గా కేరళ లోని వాయనాడ్ లో జరిగిన విపత్తు విషయంలో కూడా కోటి రూపాయలు ఇచ్చారు.