భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలబడేందుకు ఎప్పటిలాగే తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా ఎందరో సినీ స్టార్స్ విరాళాలను ప్రకటించారు. తాజాగా అక్కినేని కుటుంబం కూడా విరాళం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద సహాయక కార్యక్రమాల కోసం రూ. కోటి సాయంగా అందిస్తున్నట్లు అక్కినేని కుటుంబం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నట్లు తెలిపింది.
“ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం” అని అక్కినేని కుటుంబం తాజా ప్రకటనలో పేర్కొంది.