ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులు అవ్వడంతో పాటుగా కట్టుబట్టలతో రోడ్ మీద నిలబడ్డారు. కొన్ని ఏరియాలలో అయితే చనిపోయారు కూడా. అందుకు సంబంధించిన వార్తలు పలువురిని కంటతడి పెట్టిస్తుంది.ఇందుకు సినిమా తారలు మినహాయింపు కాదు. వరద బాధితులకి తమ సానుభూతిని తెలియచేస్తూ మీకు మేమున్నాం అంటూ భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా సరికొత్త చర్చ జరుగుతుంది.
చిరంజీవి దగ్గర నుంచి మొదలుకొని బాలకృష్ణ,మహేష్ బాబు, ప్రభాస్,ఎన్టీఆర్, బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, త్రివిక్రమ్, అశ్వనీదత్, సితార ఎంటర్ టైన్మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,వెంకీ అట్లూరి , అనన్య నాగళ్ళ ఇలా హీరోల దగ్గరనుంచి నిర్మాతలు దర్శకులు, నటీమణుల దాకా అందరు కష్టాల్లో ఉన్న తెలుగు వారిని ఆదుకోవడానికి కోట్ల రూపాయలని విరాళంగా ఇస్తున్నారు. మరి కొంత మంది ఇదే బాటలో ఇవ్వబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా సిఎం సహాయనిధికి కోటి రూపాయలని ప్రకటించాడు. మరి రాజకీయనాయకులు ఎందుకు ఇలాంటి సమయాల్లో విరాళాలు ప్రకటించరని పలువురు చర్చించుకుంటున్నారు.
ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీకు మేమున్నాం. ప్రజలకి సేవ చెయ్యడానికే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పే రాజకీయనాయకులు సినిమా వాళ్ళల్లా క్యూ కట్టి ఎందుకు ఆదుకోరని అంటున్నారు. కొంత మంది స్థానిక రాజకీయనాయకులు వరద బాధితుల కోసం పలు రకాలుగా సాయం చేస్తున్నా కూడా, నేడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు, పదవుల్ని అనుభవించిన వాళ్లు, ఎందుకు సినిమా వాళ్ళల్లా ప్రజలని ఆదుకోవడానికి ముందుకు రారని చర్చించుకుంటున్నారు. ఇక కరుడు కట్టిన సినీ అభిమానులు అయితే సినిమా ఎప్పుడు కూడా గొప్పదే అని అంటున్నారు.