నల్లగొండ జిల్లా:దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా ఇంకా మా బతుకులు పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నాయని,ఈ బతుకులు ఇంకెన్నాళ్ళుభరించాలని నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం వెల్మోనిగూడెం గ్రామానికి చెందిన నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం పేరు చెప్పి పదేళ్ళు మమ్మల్ని మోసం చేసిందని,మీరైనా మాకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఆదుకొండి సారూ అని ప్రజా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
పూరి గుడిసెల్లో వర్షాకాలం వస్తే బిక్కు బిక్కు బిక్కుమంటూ బతకాల్సి వస్తుందని,రాత్రి పూట వర్షమొస్తే తడుచుకుంటూ తెల్లవార్లూ జాగారం చేయాల్సిందేనని వాపోతున్నారు.స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి మా గ్రామాన్ని సందర్శించి,మా గోస చూసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అంటున్నారు.
సుమారు ఆ గ్రామంలో 15 కుటుంబాలు కడు పేదరికంలో ఉండి,పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నారు.ప్రభుత్వం ఇలాంటి పేదల్ని గుర్తించి మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తే వారి జీవితాల్లో వెలుగులు నింపినట్టుగా ఉంటుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
మా ఊర్లో సుమారు 15కుటుంబాలు పూరిగుడిసెల్లో నివాసం ఉంటున్నారని,గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ప్రయత్నం చేసినా ఒక్కటి ఇవ్వలేదని,ప్రస్తుత ఎమ్మెల్యేపై మాకు నమ్మకం ఉందని,తొలి విడతలోనే మా ఊరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని గ్రామ మాజీ సర్పంచ్ వెంకటయ్య కోరుతున్నారు.