యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా గుండాల మండల పరిధిలోని సుద్దాల గ్రామంలో మోటార్ సైకిల్ యాత్రను సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సుద్దాల గ్రామానికి ఒక చరిత్ర ఉన్నదని,సుద్దాల హనుమంతు,గుర్రం యాదగిరిరెడ్డి లాంటి మహానుభావులు జన్మించిన గ్రామం ఇదేనని,ఈ ప్రాంతంలో అనేకమంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని భూమికోసం,భుక్తి కోసం,వెట్టిచాకరు విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలర్పించారని గుర్తు చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ ఆలేరు ప్రాంతానికి సాగునీరు అందించడంలో విఫలమైందని గత 35 సంవత్సరాలుగా సాగునీరు కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని, రాబోయే కాలంలో ప్రజల పక్షాన పోరాటం ఉదృతం చేస్తామని చెప్పారు.తెలంగాణ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాలలో చేర్చినట్లయితే తెలంగాణ ప్రాంత ఉనికి భవిష్యత్తు తరానికి అర్థమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హరిచంద్ర,అనంతుల రామచంద్రయ్య,ఉప్పుల కొమురయ్య,పుల్లయ్య, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.