నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.గ్రామంలోని ఆలయ్యంలో ఓ దొంగ చోరికి పాల్పడ్డాడు.
ఇది గమనించిన స్థానికులు అలర్ట్ కావడంతో సదరు స్థానిక దొంగ గ్రామస్తులకు అడ్డంగా దొరికిపోవడంతో ఓ స్థంభానికి కట్టేసి దేహశుద్ధి చేయడానికి అంతా సిద్ధం చేశారు.ఇంతలో ఆ దొంగ గ్రామస్తులను ఓ కోరిక కోరాడు.
నాకు బాగా ఆకలి వేస్తుంది,అన్నం పెట్టాక కొట్టండని వేడుకున్నాడు.తెలంగాణలో ఇంటికి వస్తే శత్రువుకైనా అన్నం పెట్టి పంపిస్తారనే సెంటిమెంట్ తెలిసిందే కదా…దానిని ఆ గ్రామస్తులు నిజం చేశారు.
దొంగ కోరిక మేరకు అతనికి ఆప్యాయంగా కడుపునిండా పులిహోర గోరు ముద్దలతో తినిపించారు.ఇక చాలు అనే వరకు పెట్టాక ఇక అసలు సినిమా షురూ చేశారు.
ఇప్పుడే కాదు గతంలో కూడా సదరు దొంగ పలు ఇళ్ళల్లో దొంగతనాలు చేశాడని అందరూ కలిసి కడుపు నిండే దాకా నోట్లో కుక్కి కుక్కి పెట్టింది కక్కేదాకా వీపు విమానం మోత మోగించారు.అనంతరం పోలీసులకు అప్పగించారు.