మా నగరం, ఖైదీ, విక్రమ్‌, మాస్టర్‌, లియో.. ఇలా ఓ అరడజను సినిమాలతో కేవలం ఐదేళ్ళలో స్టార్‌ డైరెక్టర్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు లోకేష్‌ కనకరాజ్‌. తను చేసే ప్రతి సినిమా విభిన్న కథాంశంతో ఉండడం, హీరోని ఒక రేంజ్‌లో ఎలివేట్‌ చేయడం, పక్కా స్క్రీన్‌ప్లేతో సినిమాని పరుగులు పెట్టించడం లోకేష్‌లోని ప్రత్యేక లక్షణాలు. డైరెక్టర్‌గా పరిచయమైన తర్వాత చాలా తక్కువ టైమ్‌లోనే కమల్‌హాసన్‌, కార్తీ, విజయ్‌ వంటి టాప్‌ హీరోలతో బ్లాక్‌బస్టర్స్‌ తీసి అందరి దృష్టినీ ఆకర్షించారు. లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ పేరుతో అతను చేస్తున్న సినిమాల్లోని కంటెంట్‌ ఎంతో విభిన్నంగా ఉండడమే కాకుండా టాప్‌ హీరోలు సైతం అతను చేసే సినిమాలపై ఆసక్తి చూపించడం విశేషం. 

ప్రస్తుతం సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కాంబినేషన్‌లో లోకేష్‌ చేస్తున్న ‘కూలీ’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ఎంతో విభిన్నంగా ఉండడమే కాకుండా సినిమాపై వున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని రెట్టింపు చేసింది. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో రజినీతోపాటు టాలీవుడ్‌ టాప్‌ హీరో నాగార్జున, కన్నడ టాప్‌ హీరో ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్‌ షాహిర్‌ వంటి హీరోలు నటిస్తుండడంతో సినిమాకి మరింత హైప్‌ వచ్చింది. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ‘కూలీ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాగార్జున నెగెటివ్‌ టచ్‌ ఉన్న క్యారెక్టర్‌లో చేస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. నాగార్జున ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని మాత్రమే చిత్ర యూనిట్‌ ప్రకటించింది తప్ప విలన్‌గా చేస్తున్నారా లేక నెగెటివ్‌ టచ్‌ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారా అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నాగార్జున చేస్తున్నది విలన్‌ క్యారెక్టరే అని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్‌ వైజాగ్‌లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో నాగార్జున క్యారెక్టర్‌ ఎంటర్‌ అయింది. ఔట్‌డోర్‌లో జరిగిన ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు లోకేష్‌. అతని సినిమాల్లో వయొలెన్స్‌ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగానే నాగార్జున్‌ చేసిన యాక్షన్‌ సీన్‌ కూడా ఉంది. చేతితో సుత్తి పట్టుకొని ఓ వ్యక్తిని కొడుతున్న షాట్‌ను తీశారు. ఇందులో నాగార్జున తమిళ్‌లో చెప్పిన డైలాగ్స్‌ కూడా వినిపించాయి. అయితే ఇది ఔట్‌డోర్‌లో తీసిన సీన్‌ కావడంతో ఎవరో సీక్రెట్‌గా దాన్ని చిత్రీకరించి సోషల్‌ మీడియాలో వదిలారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

ఈమధ్యకాలంలో పెద్ద హీరోల సినిమాల్లోని సీన్స్‌ షూటింగ్‌ సమయంలోనే లీక్‌ అవ్వడం సర్వసాధారణం అయిపోయింది. దీనిపై దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ స్పందించారు. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. కేవలం ఒక్క వీడియో వల్ల తమ రెండు నెలల కష్టం వృధా అయిపోయిందని అన్నారు. ఇలాంటి వీడియోలను లీక్‌ చేయడం వల్ల సినిమాకి పెద్ద నష్టం జరుగుతుందని, దయచేసి ఇలాంటివి ఇకపై జరగవని ఆశిస్తున్నానని అన్నారు. ఇటీవలే వైజాగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశారు లోకేష్‌. ఈ షెడ్యూల్‌లో శృతిహాసన్‌ కూడా పాల్గొంది. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌తోపాటు వివిధ భాషలకు చెందిన భారీ తారాగణం కూడా తోడవ్వడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటివరకు అపజయం లేని డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లోకేష్‌ ‘కూలీ’ని ఏ రేంజ్‌ హిట్‌ సినిమాగా నిలబెడతాడో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here