ప్రస్తుతం దేశం యావత్తూ చర్చించుకుంటున్న ఏకైక అంశం.. తిరుమల లడ్డు. భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, హిందుత్వాన్ని కాలరాసేలా కొందరు ఉద్దేశ పూర్వకంగా చేసిన ఘాతుకాన్ని దేశ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఎంతో మంది ప్రముఖులు, పలు రాజకీయ పార్టీలు, హిందూ సంస్థలు ఈ దుశ్చర్యపై గళమెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో, కలుషితమైన నెయ్యి వాడకం విషయంలో జరిగిన అవకతవకలపై విచారణను వేగవంతం చేస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై పవన్కళ్యాణ్ పెట్టిన పోస్ట్ను కోట్ చేస్తూ నటుడు ప్రకాష్రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘డియర్ పవన్ కళ్యాణ్.. సాక్షాత్తూ మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఇది జరిగింది. దయచేసి విచారించండి.. దోషులెవరో తెలుసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఇప్పటికే దేశంలో మతరపరమైన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎందుకీ సమస్యను జాతీయస్థాయిలో ప్రచారం చేస్తున్నారు?’ అంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ప్రకాష్రాజ్ తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా ప్రకాష్రాజ్ చేసిన వ్యాఖ్యలపై హీరో మంచు విష్ణు స్పందిస్తూ ‘తిరుమల లడ్డు అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కొన్ని కోట్ల మంది హిందువుల నమ్మకానికి ప్రతీక. ఈ వ్యవహారంపై పవన్కళ్యాణ్గారు సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. పవిత్రమైన మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. మతపరమైన విద్వేషాలు ఎలా చెలరేగుతున్నాయో మీకూ తెలుసు’ అని పోస్ట్ చేశారు.