ఒకప్పుడు నైజాంతో పోలిస్తే ఆంధ్రాలో తెలుగు సినిమాకి మార్కెట్ ఎక్కువగా ఉండేది. అయితే కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. ఆంధ్రా కంటే నైజాం ఏరియాలోనే వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఆంధ్రాలో టికెట్ ధరలు తక్కువగా ఉండటం, మిడ్ నైట్ షోలు లేకపోవడం. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో సినిమా టికెట్ ధరలను బాగా తగ్గించారు. దానికి తోడు మిడ్ నైట్ షోలకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఓపెనింగ్స్, ఫుల్ రన్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడింది. ఓవరాల్ గా హిట్ అనిపించుకున్న కొన్ని భారీ సినిమాలు కూడా ఆంధ్రాలో మాత్రం నష్టాలను చూడాల్సి వచ్చింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ పరిస్థితి మారింది. ఆంధ్రాలో కూడా తెలుగు సినిమాకి మంచి రోజులొచ్చాయి. ‘దేవర’ సినిమాతోనే దానికి శ్రీకారం పడింది. (Devara Movie)

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’ సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉండటం దేవరకు కలిసొచ్చింది. టికెట్ ధరల పెంపుకి, మిడ్ నైట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సినీ అభిమానులు సంబరపడుతున్నారు. మునుపటి అసలుసిసలైన సినిమా పండగ రోజులు వచ్చాయని ఖుషీ అవుతున్నారు. అర్థరాత్రి నుంచే థియేటర్ల దగ్గర సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు టికెట్ ధరల పెంపు కూడా ఎక్కువగానే ఉండటంతో బయ్యర్లు సైతం ఆనందపడుతున్నారు. మళ్ళీ ఆంధ్రాకి పూర్వ మార్కెట్ వస్తుందని, వసూళ్లలో నైజాంని మించి పోతుందని చెబుతున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం సినీ పరిశ్రమకు సహకరిస్తుందని చెబుతుంది. ఈ లెక్కన దేవర మొదలుకొని రాబోయే భారీ సినిమాలన్నింటికీ మంచి రోజులు వచ్చినట్టే. దీంతో హిట్ సినిమాలకు ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే భయం ఇక బయ్యర్లకు దూరమైనట్టే అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here