మారుతి.. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుకుంటున్న డైరెక్టర్‌. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ని స్టార్ట్‌ చేసి అందులో సక్సెస్‌ ఆ తర్వాత కొన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌లు అందుకున్నారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. అక్టోబర్‌ 8 మారుతి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది, ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు, డైరెక్టర్‌గా క్లీన్‌ చిట్‌ ఎలా సాధించారు వంటి విషయాల గురించి తెలుసుకుందాం. 

డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా మంచి అనుభవం సంపాదించిన తర్వాత ఎస్‌.కె.ఎన్‌., బన్నీ వాస్‌ వంటి మిత్రుల సహకారంతో గుడ్‌ సినిమా గ్రూప్‌ అనే బ్యానర్‌ను స్థాపించి తొలి సినిమాగా ‘ఈరోజుల్లో’ చిత్రాన్ని రూపొందించారు. తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు మారుతి. రూ.54 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా రూ.12 కోట్లు కలెక్ట్‌ చేసింది. రెండో సినిమాగా ‘బస్ట్‌స్టాప్‌’ చిత్రాన్ని రూపొందించారు. బెల్లంకొండ సురేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎ సెంటర్స్‌లో ఈ సినిమా ఏవరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. బి, సి సెంటర్స్‌లో మాత్రం సూపర్‌హిట్‌ అయింది. మారుతి డైరెక్ట్‌ చేసిన రెండు సినిమాలూ కమర్షియల్‌గా సక్సెస్‌ అయినప్పటికీ అతనిపై బూతు డైరెక్టర్‌ అనే ముద్ర పడిపోయింది. ఎందుకంటే యూత్‌ని టార్గెట్‌ చేస్తూ ఈ రెండు సినిమాలను రూపొందించారు. అప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా డబుల్‌ మీనింగ్‌ డైలాగులు ఎక్కువగా జొప్పించడంతో మారుతిపై ఆ బ్రాండ్‌ పడిపోయింది. 

డైరెక్టర్‌గా తనపై పడిన ఆ మచ్చను చెరిపేందుకు కొన్నాళ్ళు నిర్మాతగా కొనసాగారు. డైరెక్షన్‌ సూపర్‌విజన్‌ చేస్తూ డైరెక్టర్‌గా తన పేరు వేసుకోలేదు. అలా చేసిన సినిమాల్లో ‘ప్రేమకథా చిత్రమ్‌’ పెద్ద హిట్‌ సినిమాగా నిలిచింది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.20 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఈ సినిమా తర్వాత రొమాన్స్‌, లవ్‌ యు బంగారమ్‌, లవర్స్‌ వంటి సినిమాలను వేరే డైరెక్టర్స్‌తో నిర్మించారు. నాలుగు సినిమాల గ్యాప్‌ తీసుకున్న తర్వాత అల్లు శిరీష్‌ హీరోగా గీతా ఆర్ట్స్‌ నిర్మించిన ‘కొత్తజంట’ చిత్రానికి డైరెక్టర్‌గా తన పేరు వేసుకున్నారు మారుతి. ఈ సినిమా ఏవరేజ్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నాని హీరోగా చేసిన ‘భలేభలే మగాడివోయ్‌’ చిత్రం మారుతి కెరీర్‌లో మొదటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అనిపించుకుంది. ఆ తర్వాత వెంకటేష్‌తో ‘బాబు బంగారం’, శర్వానంద్‌తో ‘మహానుభావుడు’, సాయిధరమ్‌ తేజ్‌తో ‘ప్రతిరోజూ పండగే’  వంటి సినిమాలు కమర్షియల్‌గా మారుతిని కమర్షియల్‌ డైరెక్టర్‌గా పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లాయి. డైరెక్టర్‌గా అతని చివరి సినిమా గోపీచంద్‌ హీరోగా వచ్చిన ‘పక్కా కమర్షియల్‌’. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. 

డైరెక్టర్‌గా 2012లో ఎంట్రీ ఇచ్చిన మారుతి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా ‘ది రాజా సాబ్‌’ నిలవబోతోంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ని డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ మారుతికి వచ్చింది. ఈమధ్యకాలంలో వచ్చిన ప్రభాస్‌ సినిమాలన్నీ మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌గా ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు ప్రభాస్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చేసేందుకు మారుతి సిద్ధమయ్యారు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ‘ది రాజా సాబ్‌’ మారుతి కెరీర్‌కి అత్యంత కీలకంగా మారింది. ప్రభాస్‌ హిట్‌ చిత్రాల వరసలో ఈ సినిమా కూడా నిలుస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు మారుతి. ఈమధ్యకాలంలో వచ్చిన సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకున్న మారుతి ‘ది రాజా సాబ్‌’తో మరో బ్లాక్‌బస్టర్‌ కొట్టాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here