2019 ఎన్నికల్లో గెలిచి-వైసీపీకి జై కొట్టి
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్… ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు. అయితే వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఆ పార్టీకి దగ్గరైన రాపాక…అనంతరం పార్టీలో చేరారు. జనసేనపై, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై రాపాక ఎన్నో సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక వైఎస్ జగన్ అండతో నియోజకవర్గంలో తనకు తిరుగులేదని భావించిన రాపాక… రాజోలు టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. తన కుమారుడి వివాహ కార్డుపై వైఎస్ జగన్, భారతి చిత్రాలు కూడా ముద్రించారు. అప్పట్లో ఇది వైరల్ అయ్యింది. జనసేన నుంచి గెలిచిన రాపాక… జగన్ కు జై కొట్టడంతో జనసైనికులు అప్పట్లో తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ రాపాక జనసేనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఐదేళ్లు వైసీపీకి మద్దతు తెలిపిన రాపాకను గ్లాస్ పార్టీలోకి ఆహ్వానిస్తారో? వద్దంటారో? ఈ విషయంపై జనసైనికులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. మరో వైపు రాపాక టీడీపీ లేదా బీజేపీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.