వర్కర్ టు ఓనర్ సిస్టమ్ ను అమలు చేయాలి
సిరిసిల్లలో వస్త్ర సంక్షోభానికి నేత కార్మికుల ఆర్థిక ఇబ్బందులకు అనేక కారణాలు ఉన్నాయి. అమలుకు నోచుకోని పాలకుల హామీలు, అధికారుల అనాలోచిత విధానాలు నేతన్నల బతుకులను ఆగం చేస్తున్నాయి. వస్త్ర పరిశ్రమలో మూడు అంచెల విధానం నేత కార్మికుల బతుకులను దుర్బరం చేస్తుంది. యాజమాని, ఆసామి, వర్కర్ మూడంచెల విధానం ఉండడంతో ప్రభుత్వం ఏ సహాయం చేసిన యాజమాని, ఆసామికే చెందుతుంది. రోజంతా మగ్గంపై పని చేసే వర్కర్ నేత కార్మికుడికి చేరడం లేదు. ముడి సరుకులు యాజమాని కొనుగోలు చేసి ఆసామికి అప్పగిస్తాడు. ఆసామి మరమగ్గాలపై నేత కార్మికులతో గుడ్డను నేయిస్తాడు. అలా నేస్తే పాలిస్టర్ గుడ్డకు మీటర్ కు రూపాయి నుంచి రుపాయి 20 పైసలు, కాటన్ గుడ్డకు మీటర్ కు రూ. 1.60 పైసల నుంచి రెండు రుపాయల వరకు కార్మికుడికి చెల్లిస్తారు. రెక్కల కష్టం పైనే కార్మికుల బతుకులు ఆధారపడి ఉంటాయి.