ఇండియాలో క్రికెటర్లకి, సినిమా స్టార్లకి ఉన్నంత ఫాలోయింగ్‌ ఎక్కడా ఉండదు. ముఖ్యంగా సినిమా హీరోలకు ఉండే ఫాలోయింగ్‌ పూర్తిగా భిన్నమైంది. ఒకప్పుడు హీరోలకు వేల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉండేవి. ఇక హీరోయిన్లకు కొందరు టెంపుల్స్‌ కూడా కట్టించారు. మనవాళ్ళ అభిమానం అంటే అంతే పీక్స్‌లో ఉంటుంది. తమ అభిమాన హీరో కోసం లేదా హీరోయిన్‌ కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధ పడతారు. హీరోల పుట్టినరోజుకి దూర ప్రాంతాల నుంచి అభిమానులు తరలి రావడం, శుభాకాంక్షలు తెలియజేయడం, సెల్ఫీలు దిగడం మనం చూస్తూనే ఉంటాం. తమ అభిమాన హీరోని కలిసే అవకాశం ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఎంత దూరం నుంచైనా వచ్చి వారిని కలుస్తుంటారు. 

తాజాగా అల్లు అర్జున్‌(allu arjun) అభిమాని మోహిత్‌ ఒక పెద్ద సాహసం చేశాడు. ఉత్తరప్రదేశ్‌ నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ హైదరాబాద్‌ వచ్చాడు. తన అభిమాన హీరో అల్లు అర్జున్‌ను కలిసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌ నుంచి దాదాపు 1600 కి.మీ. సైకిల్‌పై ప్రయాణించాడు మోహిత్‌. మొదటి నుంచీ బన్నీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. ఇతర రాష్ట్రాలవారు కూడా అతన్ని ఇష్టపడతారు. ‘పుష్ప’ తర్వాత ఆ క్రేజ్‌ మరింత పెరిగిందని చెప్పాలి. ‘పుష్ప’(pushpa) చిత్రంలో అల్లు అర్జున్‌ పెర్‌ఫార్మెన్స్‌, అతని మేనరిజం, చెప్పిన డైలాగ్స్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. ఈ ఒక్క సినిమాతోనే బన్నీ ఫ్యాన్స్‌ విపరీతంగా పెరిగిపోయారు.    

తనను కలిసేందుకు కొన్ని వందల కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చిన మోహిత్‌ని చూసి బన్నీ ఎమోషనల్‌ అయ్యారు. ఎంతో ఆప్యాయంగా అతన్ని పలకరించి అతని వివరాలన్నీ తెలుసుకున్నారు. అలాగే కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి కూడా ఆరా తీశారు. ‘పుష్ప2’(pushpa2) ప్రమోషన్స్‌కి యు.పి. వచ్చినట్టయితే తప్పకుండా కలుస్తానని అతనికి హామీ ఇచ్చారు బన్నీ. అతనికి ఓ మొక్కను బహుమానంగా అందించారు. అతని కోసం విందు ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అతన్ని బస్సులో పంపించే ఏర్పాటు చేయమని, అలాగే కొంత డబ్బు కూడా ఇవ్వమని తన స్టాఫ్‌కి సూచించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అరుదైన విషయాన్ని తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్‌ ఎంతో మురిసిపోతున్నారు. అల్లు అర్జున్‌ తన అభిమానుల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారో ఈ సంఘటనతో మరోసారి ప్రూవ్‌ అయింది. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here