వాతావరణ హెచ్చరిక
అల్పపీడనం ఈ రోజు తీరం దాటే అవకాశం ఉండడంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, చెన్నై జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం వైపు కదులుతుండటంతో చెన్నై, పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం అక్టోబర్ 17 తెల్లవారుజామున పుదుచ్చేరి- నెల్లూరు మధ్య ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తమిళనాడులో ఈ నెల 17న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.