పుష్ప-2 విడుదల తేదీ మారింది. డిసెంబర్ 6న విడుదల కావాల్సిన ఈ సినిమాని ఒకరోజు ముందుగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు తాజాగా నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియా నుంచి ఎదురైన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

– పుష్ప పార్ట్-3 కూడా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. పుష్ప-2 లో పార్ట్-3 కి సంబంధించిన లీడ్ ఉంటుందని తెలిపారు.

– జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చింది, ఆయనతో సాంగ్ కొరియోగ్రఫీ చేయిస్తారా? అనే ప్రశ్నకు స్పందించిన నిర్మాతలు.. ఇప్పటికే  వేరే కొరియోగ్రాఫర్ ని తీసుకున్నామని అన్నారు. 

– పుష్ప-2 లో జాతర ఎపిసోడ్ కి భారీగా ఖర్చు పెట్టమని, ఆ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. దాదాపు 35 రోజులపాటు ఆ ఎపిసోడ్ షూట్ చేశామని, ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కోసం హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఎంతో కష్టపడి పనిచేశారని పేర్కొన్నారు.

– టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారముంది. కల్కి విడుదల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే.. భారీగా ఖర్చు పెట్టారు కాబట్టి, దానికి తగ్గట్టుగా పెంచుకునే అవకాశం ఇచ్చారు. అన్ని భారీ సినిమాలకు అదే స్థాయిలో మద్దతు ఇస్తున్నారు.

– పుష్ప-2 కి మెగా అభిమానుల మద్దతు ఉంటుందా? అనే  అనే ప్రశ్నకు స్పందించిన నిర్మాతలు.. మెగా అభిమానులంతా కలిసే ఉన్నారని అన్నారు. ఎన్నికల సమయంలో చిన్న చిన్న సంఘటనలు జరిగి ఉండొచ్చు. కానీ పుష్ప-2 సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటున్నారు. అల్లు అర్జున్ గారికి ఏ పార్టీతో సంబంధం లేదని అన్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here