1987లో విడుదలైన ‘ఆగ్‌ హి ఆగ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చుంకీ పాండే ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. ఆరోజుల్లో బాలీవుడ్‌లో సోలో హీరోల సినిమాల కంటే మల్టీస్టారర్స్‌ ఎక్కువగా వచ్చేవి. వాటిలో సెకండ్‌ హీరోగా, నలుగురిలో ఒక హీరోగా చాలా సినిమాల్లో నటించాడు. అతని కుమార్తె అనన్య పాండే 2019లో విడుదలైన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమైంది. ఓ నాలుగు సినిమాల్లో నటించిన తర్వాత తెలుగులో విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్‌’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. చాలా మంది బాలీవుడ్‌ హీరోయిన్లు టాలీవుడ్‌లో టాప్‌ రేంజ్‌కి వెళ్ళారని తెలుసుకున్న చుంకీ పాండే.. తన కుమార్తెను ‘లైగర్‌’ సినిమా చేసేందుకు ఎంకరేజ్‌ చేశాడు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రిలీజ్‌ అయిన ఆ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాకి పనిచేసిన ఎంతో మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభవంతో మళ్ళీ టాలీవుడ్‌ వైపు చూడలేదు అనన్య. 

‘లైగర్‌’ చిత్రం రిలీజ్‌ అయి రెండున్నర ఏళ్ళు గడిచిన తర్వాత తను ఆ సినిమా చేయడం పెద్ద పొరపాటు అంటూ అనన్య చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా డిజాస్టర్‌ కావడమే కాదు, తన పెర్‌ఫార్మెన్స్‌ విషయంలో కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంది అనన్య. ఈ సినిమా గురించి తనకు మొదటి నుంచీ సందేహంగానే ఉందని, అందుకే సినిమా చెయ్యాలా వద్దా అనే విషయంలో తండ్రి చుంకీ పాండే సలహా తీసుకున్నానని చెప్పింది. దాని గురించి చుంకీ పాండే కూడా స్పందిస్తూ తెలుగులో ఒక పెద్ద ప్రాజెక్ట్‌ కాబట్టి తప్పకుండా ఆ సినిమా చేస్తే మంచి ఫ్యూచర్‌ ఉంటుందని తానే ఆమెను ఒప్పించానని చెబుతున్నాడు. ఆ సినిమాలోని క్యారెక్టర్‌లో తను చాలా చిన్న పిల్లలా కనిపిస్తానని చెప్పిందని, అయినా బలవంతంగా ఆమెను ఒప్పించానని అంటున్నాడు చుంకీ. ‘లైగర్‌’ చిత్రంలో అనన్యకు తండ్రిగా నటించిన చుంకీ.. ఆ సినిమా రిలీజ్‌ తర్వాత తను రియలైజ్‌ అయినట్టు చెప్పాడు. నిజంగానే విజయ్‌ దేవరకొండ పక్కన చిన్న పిల్లలా ఉందని అంగీకరిస్తున్నాడు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here