1996లో ఓ హిందీ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేసిన నటుడు మాధవన్‌. ఆ తర్వాత రచయితగా, నిర్మాతగా, టీవీ షోల ప్రజెంటర్‌గా, డాక్యుమెంటరీల నిర్మాతగా పలు శాఖల్లో తన ప్రతిభను కనబరిచి ఎన్నో అవార్డులు అందుకున్నారు. తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన తొలిరోజుల్లోనే హాలీవుడ్‌ మూవీలో నటించిన ఘనత మాధవన్‌ది. 54 ఏళ్ళ మాధవన్‌ ఇప్పటికీ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమిళ్‌, హిందీ భాషల్లో అరడజను సినిమాల్లో నటిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. మాధవన్‌కి రకరకాల బైక్స్‌ను కలెక్ట్‌ చేయడం ఒక హాబీ. ఇప్పటికే అతని దగ్గర ప్రపంచంలోని పలు మోడల్స్‌ బైక్‌లు ఉన్నాయి. తాజాగా మరో కొత్త బైక్‌ను కొనుగోలు చేసి ఆ బైక్‌ను కొన్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ఆస్ట్రియాలో మోటార్‌ బైక్స్‌ కంపెనీ బ్రిక్ట్సన్‌కు పెద్ద పేరు ఉంది. ఈ కంపెనీ తయారు చేసిన క్రోమ్‌వెల్‌ 1200 సీసీ బైక్‌ను కొనుగోలు చేశారు మాధవన్‌. ఈ ఆస్ట్రియన్‌ మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ బ్రిక్ట్సన్‌ ఇండియాలోనూ షోరూమ్‌లు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే బెంగళూరు, కోల్హాపూర్‌, గోవా, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో డీలర్‌షిప్‌లు ఇచ్చింది. త్వరలో జైపూర్‌, మైసూర్‌, కోల్‌కతా, పూణే, ముంబై వంటి నగరాల్లో షోరూమ్‌లు రాబోతున్నాయి. మాధవన్‌ కొనుగోలు చేసిన క్రోమ్‌వెల్‌ బైక్‌ 1200 సిసి ఇంజన్‌ కెపాసిటీ వున్న లగ్జరీ బైక్‌. ఇందులోని ఫీచర్స్‌ నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఈ బైక్‌ కంపెనీకి మాధవన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.  అతను కొనుగోలు చేసిన బైక్‌ ధర ఇండియన్‌ మార్కెట్‌లో రూ. 7.84 లక్షలుగా ఉంది. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here