తన నటనతో, మంచి కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే పృథ్వీ.. కొంతకాలంగా వివాదాలకు నిలయంగా మారాడు. ఏ వేదిక దొరికినా మైక్ తీసుకొని అవాకులు, చవాకులు పేలుతూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పృథ్వి చేసిన వ్యాఖ్యలు కాస్త శ్రుతి మించడంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ట్రోలింగ్ చేస్తూ అతనికి నిద్ర లేకుండా చేశారు. కొందరు ఫోన్లు చేసి మరీ తమ కోపాన్ని వ్యక్తం చేశారు. బాయ్కాట్ లైలా అంటూ కొందరు నిరసన వ్యక్తం చేశారు. అయినా వెనక్కి తగ్గని పృథ్వీ సినిమాలో దమ్ముందని తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెంట్గా చెప్పాడు. కానీ, సినిమా డిజాస్టర్ కావడంతో అతని ఇమేజ్కి డ్యామేజీ జరిగిపోయింది. ఆ సమయంలోనే తన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది దాడికి దిగడంతో పృథ్వీకి ఆందోళన ఎక్కువైపోయి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తన గోడు చెప్పుకున్నాడు.
అంతటితో ఆగని పృథ్వీ.. ట్విట్టర్ని వేదికగా చేసుకున్నాడు. ‘నేను వేదికలపై నా భావాలను వెల్లడిస్తుంటే అందరూ బాధపడుతున్నారు. కాబట్టి ఈరోజు నుంచి ట్విట్టర్ని వేదికగా చేసుకుంటున్నాను. దీని ద్వారా నా భావ ప్రకటనను, నా స్వేచ్ఛను తెలియజేస్తాను’ అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్తో మరోసారి ట్రోలింగ్ మొదలైంది. వేదిక దొరికితే కామెంట్స్ చేయకుండా వదలిపెట్టని పృథ్వీకి ఇప్పుడు బుద్దొచ్చిందా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ట్విట్టర్లో అయినా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వదిలిపెట్టబోమని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఇది అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.