2022లో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న సినిమా ‘ఓదెల2’. గత ఏడాది వారణాసిలో ప్రారంభమైన ఈ సినిమా బలమైన కథ, కథనాలతో రూపొందుతోందని ఇటీవల రిలీజ్ అయిన టీజర్ చూస్తే అర్థమవుతోంది. దుష్ట శక్తుల బారిన పడిన తన గ్రామ ప్రజల్ని ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడాడు అనేది సినిమా ప్రధానంగా చూపించబోతున్నారు. దుష్టశక్తికి, దైవభక్తికి జరిగే పోరాటాన్ని ఎన్నో సినిమాల్లో మనం చూశాం. దుష్టశక్తిపై దైవభక్తి గెలవడం అనేదే ప్రతి సినిమాలోని ఇతివృత్తం. అయితే ‘ఓదెల2’ విషయానికి వస్తే.. కథనంలో, విజువల్ ఎఫెక్ట్స్లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశారు. టీజర్ చూస్తున్నప్పుడు ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. కానీ, టీజర్ మాత్రం టెరిఫిక్గా ఉంది.
ఈ సినిమా టీజర్ను మహా కుంభమేళ సందర్భంగా కాశీలో విడుదల చేశారు. తమన్నా తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలమైంది. ఇప్పుడు ‘ఓదెల2’ చిత్రంలో నాగ సాధువుగా ఓ విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమాలో అద్భుతమైన విజువల్స్ ఉన్నాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎంతో నేచురల్గా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని క్లైమాక్స్ కోసం రామోజీ ఫిలింసిటీలో వేసిన ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో చిత్రంలోని ప్రధాన తారాగణంతోపాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఎంతో భారీగా చిత్రీకరించారు. అశోక్ తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ప్లే, డైలాగులు అందించడంతోపాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. డి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ‘ఓదెల2’ విడుదల కానుంది.