పాత సినిమాల్లో బాగా పాపులర్ అయిన ట్రాక్స్ని, సీన్స్ని రీక్రియేట్ చేసి మరోసారి ప్రేక్షకుల్ని అలరించాలన్న ప్రయత్నం కొంతమంది డైరెక్టర్లు చేస్తుంటారు. అలా వచ్చిన చాలా సీన్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి కూడా. అయితే కొన్నింటికి పరిమితులు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఆ పరిమితి దాటితే సెన్సార్ వారు తమ కత్తెరకు పని చెబుతారన్న విషయం కూడా మనకు తెలుసు. తాజాగా సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ‘మజాకా’ చిత్రంలో ఇలాంటి ఓ సీన్ సెన్సార్ సభ్యులకు పని కల్పించింది. పవన్కళ్యాణ్, భూమిక జంటగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘ఖుషి’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఎంతో కీలక సన్నివేశం, సినిమా కథనాన్ని ఆసక్తికరంగా మార్చిన సన్నివేశం ఒకటుంది. హీరోయిన్ భూమిక నడుమును చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుంటాడు పవన్కళ్యాణ్. ఇది గమనించిన హీరోయిన్ అతనితో గొడవకు దిగుతుంది. ఈ సీన్ ఆ తర్వాత సినిమాను ఆసక్తికరంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించింది.
ఇదే సీన్ని రావు రమేష్, అన్షులపై రీక్రియేట్ చేశారు దర్శకుడు త్రినాథరావు. అన్షు నడుమును చూసి మెలికలు తిరుగుతున్న రావు రమేష్ని ఉద్దేశించి ‘ఏమైంది నాన్నా’ అని అడుగుతాడు సందీప్ కిషన్. దానికి రావు రమేష్ ‘ఇప్పటి పిఠాపురం ఎమ్మెల్యేగారు అప్పట్లో ఇలాంటివి చూసి ఎంత కంగారు పడ్డారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది’ అంటాడు. ఈ డైలాగ్కి సెన్సార్ వారు అభ్యంతరం చెప్పడమే కాకుండా కట్ చేశారు కూడా. అయితే ఈ సినిమాలో తనకు ఎంతో ఇష్టమైన డైలాగ్ అదేనని సందీప్ కిషన్ చెప్పడం గమనార్హం. ఏది ఏమైనా ఫన్ జనరేట్ చేయడం కోసం దర్శకుడు చేసిన ప్రయత్నం ఆ విధంగా బెడిసికొట్టింది.