Farmers : తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోగా, భూవివాదంతో ఇంకొకరు ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా రఘునాధపల్లి మండలం సోమయ్యకుంట తండాకు చెందిన కేతావత్ సంతోష్ (36), సరోజ దంపతులు…..అప్పుల బాధతో ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కేతవాత్ సంతోష్ మృతి చెందాడు. భార్య సరోజ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే జనగామ జిల్లా,చిల్పూర్ మండలం, కొండాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు వెంకటలక్ష్మి కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని గత కొన్ని రోజులుగా రెవెన్యూ కార్యాలయం, అధికారులు,పోలీసులు చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళా రైతు వెంకటలక్ష్మి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది.