స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చ
ఈఎస్సీఐలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ ను సోమవారం మధ్యాహ్నం పరిశీలించిన అనంతరం అక్కడే వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చర్చించారు. అప్పటి వరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు అందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కచ్చితంగా లభించేలా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ఉండాలని సీఎం సూచించారు. స్కిల్ వర్సిటీ ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి అంశాలు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని అధికారులకు చెప్పారు.