మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. ప్రతి ఏడాది మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్ని అభిమానులు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే అదే రోజున చిరు చేసే కొత్త సినిమాకి సంబంధించిన అద్భుతమైన అప్డేట్ వస్తుంది. ఈరోజు మెగాస్టార్ తన 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అందులో భాగంగా కుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళి వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం పండితులు వేదాశ్వీరచనం చేశారు. టిటిడి అధికారులు చిరంజీవికి శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’కు సంబంధించి ఓ పవర్ఫుల్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. చేతిలో త్రిశూలం పట్టుకొని మోకాళ్ళపై కూర్చున్న చిరు వెనుక విశ్వంభర యూనివర్స్ కనిపిస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ను మరింత పెంచిందని చెప్పాలి. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ జోనర్లో రూపొందిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు పోస్టర్తో సినిమాపై హైప్ మరింత పెరిగిందని చెప్పాలి.
మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు వశిష్ట తన విషెస్ని తెలియజేస్తూ ‘చీకటి, చెడు ప్రపంచాన్ని చుట్టుముట్టినపుడు దానిపై పోరాటం చేసేందుకు ప్రతిసారీ ఒక స్టార్ పుడుతుంది. మెగాస్టార్ చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వచ్చే సంక్రాంతికి ప్రపంచమంతా విశ్వంభరతో ఊగిపోనుంది. 2025 జనవరి 10న విడుదలవుతున్న ‘విశ్వంభర’ను థియేటర్లలో మాస్ యూనివర్స్ చూసేందుకు రెడీగా ఉండండి’ అంటూ పోస్ట్ చేశారు.
ఇక ఈ పోస్టర్పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి తాలూకు పోలికలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. డెఫినెట్గా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని కొందరు అంటున్నారు. దానికి తగ్గట్టుగానే దర్శకుడు వశిష్ట సినిమాను ఓ రేంజ్ తీస్తున్నాడని అర్థమవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో కీలక పాత్రలో ఆషికా రంగనాథ్ కనిపిస్తుంది. ఈ సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ను కీరవాణి కంపోజ్ చేశారని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న ‘విశ్వంభర’ టీమ్ మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.