రద్దీకి అనుగుణంగా బస్ సర్వీసులు..
ప్రయాణికుల రద్దీని ఊహించిన అధికారులు.. రీజియన్ పరిదిలో అందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగారు. డిప్యూటీ ఆర్ఎంలు, అన్ని డిపోల మేనేజర్లు, ఇతర సిబ్బందితో రీజినల్ మేనేజర్ ఎస్. సుచరిత సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జేబీఎస్ తోపాటు రీజియన్లోని అన్ని డిపోల్లో అధికారులు, సిబ్బంది బస్టాండ్లలోనే మకాం వేసి రద్దీకి అనుగుణంగా బస్సులు నడిచేలా చూశారు. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన చర్యలు చేపట్టారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో మొత్తం 860 బస్సులు ఉన్నాయి. ఇవన్నీ రోడ్లపైనే పరుగులు పెట్టాయి. అదనపు ట్రిప్పులను నడిపిస్తూనే.. హైదరాబాద్ తోపాటు ఇతర డిపోల బస్సులనూ తెప్పించి నడిపించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులు, సిబ్బంది తమ సెలవులను పక్కన పెట్టి విధి నిర్వహణలో భాగస్వాములయ్యారు.