నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్‌ 1న హైదరాబాద్‌ హైటెక్స్‌ నోవోటెల్‌ హోటల్‌లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ని ప్లాన్‌ చేశారు. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్‌ మెయిన్‌ స్పాన్సర్‌గా, సుచిర్‌ ఇండియా, వేగా జ్యూయలర్స్‌, కెఎల్‌ఎం షాపింగ్‌ మాల్‌, శ్రేయాస్‌ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఎంతోమందికి ఆహ్వానాన్ని అందించారు. అయితే కొంతమందికి ఆహ్వానాలు అందలేదని వస్తున్న వార్తలపై తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ స్పందిస్తూ శుక్రవారం ప్రెస్‌ మీట్‌ నిర్వహించి క్లారిటీ ఇచ్చింది.

ఈ ప్రెస్‌ మీట్‌లో ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘తెలుగు సినీ రంగంలోని అన్ని శాఖలు కలిసి బాలకృష్ణగారి స్వర్ణోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు .. ఇలా అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఇతర రాష్ట్రాల ఫిల్మ్‌ ఇండస్ట్రీల నుంచి కూడా ప్రముఖులు వస్తారు. ఈ ఈవెంట్‌ను శ్రేయాస్‌ మీడియా నిర్వహిస్తోంది. ఇన్విటేషన్స్‌ అందలేదని మాకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అన్ని యూనియన్ల ద్వారా సభ్యులందరికీ పీడీఎఫ్‌ రూపంలో ఆహ్వానం పంపించాము. ఫిజికల్‌ ఇన్విటేషన్‌ ఎవరికైనా రాకపోతే తెలుగు ఇండస్ట్రీ మన కుటుంబం కాబట్టి ఇదే మా వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం’ అని చెప్పారు.

స్పాన్సర్‌ కిరణ్‌ మాట్లాడుతూ..‘బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో భాగం కావడం మా అదృష్టం. ఒక చారిత్రాత్మక ఈవెంట్‌లా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నటుడు, అజాత శత్రువు అయిన బాలకృష్ణగారికి ఇలాంటి సన్మానం చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి’’ అని పిలుపునిచ్చారు.

కేఎల్‌ఎం ఫ్యాషన్‌ మాల్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘బాలకృష్ణగారు నటన ప్రారంభించి 50 ఏళ్లు పూర్తవుతోంది. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలోని అన్ని శాఖలు కలిసి ఇలాంటి కార్యక్రమం చేయడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమానికి మీడియాలో మంచి క్రేజ్‌ వస్తోంది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కేఎల్‌ఎన్‌ కల్యాణ్‌, అనుపమ్‌ రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, సుచిర్‌ ఇండియా కిరణ్‌, మాదాల రవి, సి.కల్యాణ్‌, భరత్‌ భూషణ్‌, దామోదర్‌ ప్రసాద్‌, ప్రసన్న కుమార్‌, శివ బాలాజీ, పరుచూరి గోపాలకృష్ణ, అశోక్‌ కుమార్‌, మాదవపెద్ది సురేష్‌, సుబ్బారెడ్డి, అనిల్‌ కుమార్‌ వల్లభనేని, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here