Kadem Project : నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ లతో కలిసి కడెం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు లోని వరద నీరు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.