గోపీచంద్‌ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (srinu vaitla) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వం’ (Viswam). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా టీజర్ విడుదలైంది.

శ్రీను వైట్ల సినిమాలు అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రెస్. ఇక గోపీచంద్ యాక్షన్ తో ఏ రేంజ్ లో అలరిస్తాడో, కామెడీ టైమింగ్ లోనూ అదే స్థాయిలో మెప్పిస్తాడు. అలాంటిది ఈ ఇద్దరు కలిస్తే కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి శాంపిల్ అన్నట్టుగా తాజాగా విడుదలైన ‘విశ్వం’ టీజర్ లో కామెడీ అదిరిపోయింది. గోపీచంద్, నరేష్, వెన్నెల కిషోర్ ఇలా అందరూ తమ మార్క్ కామెడీ డైలాగ్ లతో పోటాపోటీగా నవ్వించే ప్రయత్నం చేశారు. అలాగే టీజర్ లో గోపీచంద్ మార్క్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. 

అయితే టీజర్ మొత్తంలో ఒక డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “కొట్టారు తీసుకున్నాం.. రేపు మాకూ టైం వస్తది, మేమూ కొడతాం” అని గోపీచంద్ ఒక డైలాగ్ చెప్పాడు. ఇది వైఎస్ జగన్ డైలాగ్ ని ఇమిటేట్ చేసినట్లుగా ఉంది. గతంలో జగన్ ఒకసారి “కొట్టాడు తీసుకున్నాం.. మా టైం వస్తుంది.. మేమూ కొడతాం” అంటూ మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. అప్పట్లో ఆ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఇప్పుడదే డైలాగ్ ని ‘విశ్వం’ టీజర్ లో గోపీచంద్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ‘విశ్వం’ సినిమాలో నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here