Narsapur Mla Sunitha Lakshma Reddy : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జన వేడుకల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి ఇంటి ముందు టపాసులు పేల్చుతూ కాంగ్రెస్ కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు టపాసులు పేలుస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాట జరిగాయి. ఎమ్మెల్యే ఇంటి ముందు టపాసులు పేలుస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు గేటు నుంచి లోపలికి వెళ్లి బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది. ఘటన సమయంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కుటుంబసభ్యులు ఇంట్లో లేరు. కానీ ఈ దాడి దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.