విజయదశమి రోజు విజయ ముహూర్తంగా పిలుస్తారు. అంటే ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. పిల్లలు పెద్దలు కొత్త దుస్తులు ధరించి బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలు చేస్తారు. ప్రతీ తెలుగు లోగిలి పిల్లా పాపలతో, పెద్దల ఆదరాభిమానాలతో, కన్నె పిల్లల పట్టు పావడాలతో ముత్తైదువుల పట్టు చీరల రెపరెపలతో, కొత్త అల్లుళ్ళు, మరదళ్ల సరసాలతో, కొత్త కోడళ్ళ మురిపాలతో, ఆడపడుచుల ముచ్చటలతో, షడ్రసోపేతమైన తెలుగు భోజనాలతో పండగ సందడి నెలకొంటుందని చిలకమర్తి తెలిపారు. ఒకరికొకరు కానుకలు, మిఠాయిలు ప్రేమగా పంచుకుంటారు. కలశం పెట్టి అమ్మవారి మూర్తిని పెట్టి సామూహికంగా చేసుకున్నవారు దశమి రోజున భక్తిశ్రద్ధలతో ఉద్వాసన పలికి, నిమజ్జనం చేస్తారని ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.