తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించబడిన సందర్భంగా, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ గారి నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భరత్ భూషణ్ గారు, సెక్రటరీ కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు, కోశాధికారి తుమ్మల ప్రసన్న కుమార్ గారు అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు, సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి గారు, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి గారు , తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు,సెక్రటరీ కె అమ్మిరాజు గారు, కోశాధికారి వి సురేష్ గారు, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ సెక్రెటరీ ఉమర్జీ అనురాధ గారు, తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ప్రెసిడెంట్ కె అమ్మిరాజు గారు, చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ & తెలుగు సినీ,టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్ గారు, తెలుగు సినీ,టీవీ అవుట్ డోర్ యూనిట్ టెక్నిషన్స్ యూనియన్ సెక్రటరీ వి సురేష్ గారు, తెలుగు సినీ స్టంట్ డైరెక్టర్స్ & స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ కోశాధికారి రమేష్ రాజా గారు, మొత్తం ఇండస్ట్రీ నుండి 10 అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ కలిసి నందమూరి బాలకృష్ణ గారిని కలసి ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు అంతా కలిసి త్వరలో నందమూరి బాలకృష్ణ గారిని సన్మానించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా ఏర్పాట్లు చేస్తునట్టు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ‘‘నందమూరి బాలకృష్ణ గారు నటుడిగానే కాదు, సినీ పరిశ్రమకు, సేవా కార్యక్రమాలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం ఎంతో గర్వించదగ్గ విషయం’’ అని అన్నారు.
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ… ‘‘ఈ అవార్డు నాకు, మా కుటుంబానికే కాదు, తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన గౌరవం. ఇది నాకు మరింత బాధ్యతను పెంచింది’’ అని అన్నారు.