స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినా, ఓటీటీల్లో రిలీజ్ అయినా అదే క్రేజ్ ఉంటుంది. అయితే ఆ సినిమాలు హిట్ అయ్యాయా, ఫ్లాప్ అయ్యాయా అనే దానిపైనే ఆ క్రేజ్ ఆధారపడి ఉంటుంది. కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినపుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా, ఆ తర్వాత టీవీల్లో ఓటీటీల్లో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే చాలా మంది నిర్మాతలు థియేటర్లలో వర్కవుట్ కాకపోయినా ఓటీటీ ఉందిలే అనుకుంటారు. కానీ, ఒక స్టార్ హీరో సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీ గడప తొక్కలేదు. సూపర్స్టార్ రజినీకాంత్ కీలక పాత్ర పోషించిన ‘లాల్ సలామ్’ రిలీజ్ అయి సంవత్సరం అవుతోంది. కానీ, ఇప్పటివరకు ఏ ఓటీటీ సంస్థ ఆ సినిమాను తీసుకోలేదు. ఫలితంగా ఆ సినిమా థియేటర్ల వరకే పరిమితం అయిపోయింది. థియేటర్లలో చూడనివారు ఓటీటీలో చూద్దామని ఎదురుచూస్తున్నారు. కానీ, ఆ సినిమా దానికి నోచుకోవడం లేదు.
విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ కూడా ఒక కీలక పాత్ర పోషించారు. అలాగే క్రికెటర్ కపిల్దేవ్, జీవితా రాజశేఖర్ కూడా నటించారు. ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి సంగీతం చేయడం మరో విశేషం. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. 2024 ఫిబ్రవరి 9న ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన లేదు. సాధారణంగా ఏ సినిమా అయినా విడుదలైన నెలరోజుల్లో ఏదో ఒక ఓటీటీలో కనిపిస్తుంది. కానీ, ‘లాల్ సలామ్’ చిత్రానికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. థియేటర్ల వరకే పరిమితమైపోయింది. ఒక స్టార్ హీరో, అందులోనూ సూపర్స్టార్ రజినీకాంత్ సినిమాని కూడా ఏ ఓటీటీ సంస్థ తీసుకోలేదంటే ఆశ్చర్యం కలగక మానదు.