‘చిరుత’తో హీరోగా పరిచయమైన రామ్‌చరణ్‌ ‘మగధీర’ చిత్రంతో టాలీవుడ్‌లో వన్‌ ఆఫ్‌ ది స్టార్స్‌గా ఎదిగారు. ఆ తర్వాత ఎన్నో మాస్‌, యాక్షన్‌ సినిమాలు చేసినప్పటికీ అతన్ని గ్లోబల్‌స్టార్‌గా నిలబెట్టిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో చరణ్‌ చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇకపై చరణ్‌ చేసే సినిమాలన్నీ పాన్‌ ఇండియా లెవల్‌లోనే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాణంలో ఉన్నప్పుడే శంకర్‌ డైరెక్షన్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం స్టార్ట్‌ అయింది. అది కూడా పాన్‌ ఇండియా సినిమా కావడంతో హీరోగా తన రేంజ్‌ మరింత పెరుగుతుందని ఆశించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ సినిమా డిజాస్టర్‌ అయింది. ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తన 16వ సినిమా చేస్తున్నారు చరణ్‌. అయితే ఈ సినిమా కంటే ముందే మరో పాన్‌ ఇండియా మూవీ ఛాన్స్‌ని మిస్‌ చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

నాని హీరోగా తెలుగులో ‘జెర్సీ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి తన నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ను రామ్‌చరణ్‌తో చెయ్యాల్సి ఉంది. రామ్‌చరణ్‌ 16వ సినిమా యు.వి. క్రియేషన్స్‌ నిర్మాణంలో గౌతమ్‌ దర్శకత్వంలో రాబోతున్నట్టు అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారు. దానికి కారణం గౌతమ్‌ హిందీలో రీమేక్‌ చేసిన జెర్సీ కమర్షియల్‌గా వర్కవుట్‌ కాకపోవడమేనని ప్రచారం జరిగింది. అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆ తర్వాత తేలింది. అలాగే స్క్రిప్ట్‌ విషయంలో చరణ్‌ సంతృప్తిగా లేకపోవడంతో ప్రాజెక్ట్‌ను ఆపేశారని కూడా చెప్పుకున్నారు. అయితే ఇది కూడా రూమర్‌ మాత్రమేనని తర్వాత తెలిసింది. 

వాస్తవానికి ఈ స్క్రిప్ట్‌ మీద గౌతమ్‌ నెలల తరబడి వర్క్‌ చేశారు. ఆ తర్వాత చరణ్‌కి నేరేట్‌ చేశారు. అది తన తండ్రి చిరంజీవి కూడా వినాలని చరణ్‌ చెప్పడంతో ఆయనకు కూడా ఆ స్క్రిప్ట్‌ను వినిపించారు. కానీ, చిరంజీవికి ఈ కథ నచ్చలేదు. దాంతో ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారు. అప్పుడు బుచ్చిబాబు సానాతో తన 16వ సినిమా కమిట్‌ అయ్యారు చరణ్‌. అలా ‘కింగ్‌డమ్‌’ అనే సినిమా విజయ్‌ దేవరకొండ వరకు వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ ఎంతో ఇంప్రెసివ్‌గా ఉందనే కామెంట్స్‌ వస్తున్నాయి. ఈమధ్యకాలంలో హిట్‌ అనేది లేని విజయ్‌కి ‘కింగ్‌డమ్‌’ మంచి బ్రేక్‌ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా టీజర్‌ చూస్తుంటే చాలా బిగ్‌ రేంజ్‌ సినిమాలా కనిపిస్తోంది. సినిమాలోని యాక్షన్‌ ఎపిసోడ్స్‌గానీ, బ్యాక్‌డ్రాప్‌గానీ, ఎమోషన్స్‌గానీ రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా విజయ్‌ దేవరకొండ గెటప్‌ చాలా కొత్తగా ఉండడమే కాకుండా అతని పెర్‌ఫార్మెన్స్‌ కూడా నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉందనే కాంప్లిమెంట్స్‌ కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా తన రేంజ్‌కి తగ్గ ప్రాజెక్ట్‌ నుంచి రామ్‌చరణ్‌ తప్పుకోవడం అనేది అతను తీసుకున్న గుడ్‌ డెసిషనా, బ్యాడ్‌ డెసిషనా అనేది ‘కింగ్‌డమ్‌’ చిత్రం రిలీజ్‌ తర్వాత తెలుస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. మే 30న తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here